ప్రస్తుత భారత రక్షణ వ్యవస్థను అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ పోల్చారు. ఆపరేషన్ సిందూర్పై త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీజీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్ల పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత నెలలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత యాంటీ డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ గురించి వివరిస్తున్న సమయంలో ఆయన ఈ పోలికను తీసుకొచ్చారు.
పాకిస్థాన్ దాడులను భారత్ ఎదుర్కొన్న తీరును 1970 నాటి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్తో పోల్చారు. అపుడు చెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీలు ఒకరు కాకపోతే మరొకరు వికెట్లు పడగొడతారని నానుడి ఉండేదని, అలాగే, భారత రక్షణ వ్యవస్థలు ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నాయని అభిప్రాయపడ్డారు.
"నాకు 1970ల నాటి ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఆ సమయంలో క్రికెట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ వైరం తారా స్థాయిలో ఉండేది. ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్లుగా ఉండేవారు" అని రాజీవ్ ఘాయ్ గుర్తు చేశారు.
"థామ్సన్ మిమ్మల్ని పడగొట్టకపోతే లిల్లీ తప్పక పడగొడతాడు. ఇపుడు మన రక్షణ అంచెలు కూడా అలానే ఉన్నాయి. ఒకవేళ మీరు (పాకిస్థాన్ను ఉద్దేశించి) అన్ని వ్యవస్థలను దాటుకుని వచ్చినా, ఈ బహుళస్థాయి గ్రిడ్ వ్యవస్థలోని ఏదో ఒక అంచె మిమ్మల్ని ఖచ్చితంగా కూల్చివేస్తుంది" అని రాజీవ్ ఘాయ్ హెచ్చరించారు.