Publish Date: Thu, 11 Mar 2021 (13:11 IST)
Updated Date: Thu, 11 Mar 2021 (17:25 IST)
చిరుత పులులు, పెద్దపులులు, నలుపు చిరుతలు జనవాసంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్, ఇండోర్లో చిరుత జనాలకు చుక్కలు చూపెట్టింది. జనాలపై దాడి చేసింది. ఇండోర్ ఖండ్వా రోడ్లోని నివాస ప్రాంతాలలోకి చిరుత ప్రవేశించింది. దీంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఆపై అటవీశాఖ, జంతుప్రదర్శనశాల అధికారులను రంగంలోకి దిగారు. అటవీశాఖాధికారులు, జూ అధికారులు వలలు విసిరి విశ్వప్రయత్నాలు చేసినా చిరుతపులిని పట్టుకోలేకపోయారు. చిరుతను పట్టుకునే క్రమంలో అటవీ శాఖ సిబ్బంది కూడా గాయపడ్డారు.
అంతేగాకుండా సామాన్య ప్రజల్లో భార్యాభర్తలిద్దరూ గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ సిబ్బంది, టైగర్ ఫోర్స్, జూ సిబ్బంది, వెటర్నరీ డాక్టర్లు స్పాట్కు వచ్చారు. వల విసిరి చిరుతను పట్టుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం కాస్త విఫలమైంది. ఐదేళ్ల వయస్సున్న చిరుత.. ఆ వలలో చిక్కకుండా పారిపోయిందని అధికారులు చెప్తున్నారు.
చిరుత సిబ్బంది వాహనాలపై దాడి చేస్తూ.. ఓ అధికారిపై కూడా పంజా విసిరిందని.. చిరుతను పట్టుకోలేకపోయామని సిబ్బంది చెప్పారు. చిరుత ప్రస్తుతం న్యూ రాణి బగ్లో వుందని.. ఇది గణనీయమైన జనాభాను కలిగి ఉందని అధికారి యాదవ్ తెలిపారు.
ఈ ప్రాంతం గోధుమలను పండించే 25 హెక్టార్ల వ్యవసాయ క్షేత్రమని చెప్పారు. చిరుత గోధుమలు పండించే భూముల్లో దాగివుండే అవకాశం వుందని.. ప్రజలు ఇంటి నుంచి ప్రస్తుతం బయటికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. చిరుతను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చిరుత కోసం సెర్చ్ లైట్లను అమర్చామని, గార్డులను మోహరించినట్లు చెప్పారు.
ఇదిలా వుంటే.. 2018, మార్చి 9వ తేదీన, విమానాశ్రయం రోడ్డులో ఉన్న పాల్హార్ నగర్ లోకి ఒక చిరుతపులి ప్రవేశించింది. ఆ సమయంలో చిరుత సీనియర్ ఫారెస్ట్ అధికారులు, గార్డుపై దాడికి పాల్పడింది. ఆ తర్వాత రాలమండల్ ఐఐటీ క్యాంపస్లో చిరుత సంచరించింది. దీంతో అటవీ సమీపంలోని జనవాసాల్లో వుండే ప్రజలు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.