Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ.. 76మంది జవాన్లకు గాయం.. వారం రోజుల్లో..?

Advertiesment
Ladakh clash
, శుక్రవారం, 19 జూన్ 2020 (15:17 IST)
భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 76మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరు మరో వారంలో కోలుకుని విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం భారత్-చైనాల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
 
భారత భూ భాగంలో చైనా సైనికులు వేసిన టెంట్‌ను తొలగించే ప్రక్రియలో కల్నల్ బీకే సంతోష్ బాబు నేతృత్వంలోని టీమ్, వారితో తలబడిన సంగతి తెలిసిందే. పెట్రోల్ పాయింట్-14 సమీపంలో జరిగిన ఈ ఘటనలో భారత జవాన్లపై ఇనుప రాడ్లు, పదునైన ఆయుధాలు, రాళ్లతో దాడి చేసిన చైనా సైనికులు, భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. ఇదే సమయంలో భారత జవాన్లు తీవ్రంగా స్పందించగా, సుమారు 45 మంది చైనా సైనికులు హతమైనట్టు తెలుస్తున్నా, చైనా ఇంకా అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు.
 
చైనా పీపుల్స్ ఆర్మీ దాడి తరువాత కొందరు భారత సైనికులు అదృశ్యమయ్యారని, వారంతా చైనా కస్టడీలో ఉన్నారని వార్తలు రాగా, ఆర్మీ అధికారులు అటువంటిదేమీ లేదని, ఈ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిలో భారత జవాన్లలో ఎవరూ కనిపించకుండా పోలేదని స్పష్టం చేశారు.
 
ఓ వైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనా సైన్యాధికారుల చర్చలు కొనసాగుతున్న వేళ, చైనా ఏ మాత్రమూ తగ్గకుండా, గాల్వాన్ లోయ ప్రాంతానికి బుల్డోజర్లను చేర్చింది. ఈశాన్య లడఖ్‌లో గాల్వాన్ నది ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా చర్యలు చేపడుతోంది. ఈ విషయాన్ని తాజా శాటిలైట్ చిత్రాలు నిరూపించాయి. 
 
గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలను పెంచిందని ఈ చిత్రాలను బట్టి అర్థమవుతోంది. ఇదే సమయంలో చైనా ఎటువంటి దుశ్చర్యకు దిగినా, సమర్థవంతంగా అడ్డుకునేందుకు భారీ ఎత్తున భారత సైనిక బలగాలు కూడా ఈ ప్రాంతంలో మోహరించాయి.
 
ఎల్ఏసీకి రెండు కిలోమీటర్ల పరిధిలో భారత ఆర్మీ ట్రక్స్ కనిపిస్తున్నాయి. గాల్వాన్ నది చాలా వరకూ ఎండిపోయి కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో చైనాకు చెందిన వందలాది ట్రక్కులు, బుల్డోజర్లు గాల్వాన్ లోయ, నదీ పరీవాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. 
 
చైనా వాహనాలు లోయకు 5 కిలోమీటర్ల దూరం వరకూ కనిపిస్తున్నాయని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. వాస్తవాధీన రేఖను దాటి ముందుకు వచ్చి లోయను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా చైనా కనిపిస్తోందని, దీన్ని అడ్డుకునేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నారని సైనికాధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణ, ఎంతమందికి గాయాలయ్యాయి? వాళ్లు ఎక్కడున్నారు..?