Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించిన యువతిని కొడుకు కాదన్నాడు.. తండ్రి చేరదీశాడు.. ఆస్తి రాసిచ్చాడు..

ప్రేమించిన యువతిని కొడుకు కాదన్నాడు.. తండ్రి చేరదీశాడు.. ఆస్తి రాసిచ్చాడు..
, మంగళవారం, 21 మే 2019 (16:41 IST)
కేరళ రాష్ట్రంలో ఓ అరుదైన ఘటన ఒకటి జరిగింది. ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా సహజీవనం చేసిన ఓ యువకుడు చివరకు ఆమెను వదిలించుకున్నాడు. ఈ విషయం ఆ యువకుడి తండ్రికి తెలిసింది. అంతే.. ఆ యువతిని చేరదీసి.. మరో యువకుడుకిచ్చి పెళ్లి చేశాడు. అంతేనా తన యావదాస్తిని ఆమె పేరుకు బదలాయించాడు. ఈ ఘటన కొట్టాయం జిల్లాలోని తిరునక్కారం గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరునక్కారం గ్రామానికి చెందిన షాజి అనే వ్యక్తి కుమారుడు మైనార్టీ తీరకముందే ఓ మైనర్ యువతిని ప్రేమించి సహజీవనం చేశాడు. ఈ విషయం షాజికి తెలిసింది. మైనార్టీ తీరిన తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తానని హామీ ఇచ్చాడు. ఇంతలో ఆ యువకుడుకి మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన మొదటి ప్రియురాలు నిలదీసింది. అయినా అతను పెడచెవిన పెట్టాడు. ఆ యువతి వాదనను ఆలకించలేదు. 
 
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు ఊర్లో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు కూడా యువతిని ఇంటి నుంచి గెంటివేశారు. తమకు ఇకమీదట కూతురు లేదంటూ తెగేసి చెప్పారు. ఈ విషయం షాజి దృష్టికి వచ్చింది. తన కొడుకుని, అతని మొదటి ప్రియురాలిని కూర్చొబెట్టి ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేశారు. 
 
అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమెతో పెళ్లి వద్దంటే వద్దని తెగేసి చెప్పాడు. దీంతో షాజీ బాగా ఆలోచించాడు. యువతికి న్యాయం చేయాలని నిర్ణయించాడు. ఆ యువతికి మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంతటితో ఊరుకోకుండా.. తన యావదాస్తిని ఆమె పేరిట రాసి ఇచ్చి కొడుక్కి షాక్ ఇచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.8,990కే నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్