ఒరిస్సా రాష్ట్ర వాసుల పంట పండిది. ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బంగారు ఖనిజ నిక్షేపాలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని జియోలాజికల్ సర్వే ఆఫ్ అండియా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల నిక్షేపాలను గుర్తించినట్టు తెలిపింది.
ముఖ్యంగా, రాష్ట్రంలోని సుందర్ గఢ్, నవరంగ్ పూర్, కియోంజర్, దేవగఢ్, జిల్లాల్లో ఇప్పటికే బంగారు గనులు వెలికితీత పనులు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ క్రమంలో మైనింగ్ కార్పొరేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ పరిశోధనలు చేపట్టాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు చుక్కలను తాకుతున్న తరుణంలో ఒరిస్సాలో బంగారు నిక్షేపాలు వెలుగు చూడటం ఇపుడు ఆ రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తమ రాష్ట్రం సుసంపన్న రాష్ట్రంగా మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, బంగారు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే, మయూర్ భంజ్ జిల్లాలోని ఝూసిపూర్, సూర్యాగుడా రువంశి, ఇదెల్కుచా, మారెడిమి, సులేపట్, బడం పహాడ్లలో ఈ బంగారు నిక్షేపాలు ఉన్నాయి. అలాగే, దేవగఢ్ జిల్లాలోని అదసా, రాంపల్లి, కియోంజర్ జిల్లాలో గోపూర్, గజీపూర్, మంకాడ్ చువాన్, సులేకానా, దిమిరి ముండా, మల్కాన్ గిరి, సంబల్ పూర్ బౌద్ జిల్లాల్లో సైతం పెద్ద ఎత్తున బంగారు నిక్షేపాలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది.