సెప్టెంబర్ 25వ తేదీన తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుండటంతో.. తెలంగాణలో సైతం భారీ వర్షాల నమోదుకు అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 25న ఏర్పడే ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వచ్చే 24 గంటల తర్వాత పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం సమీపంలో వాయుగుండంగా మారొచ్చని వాతావరణ శాఖాధికారులు పేర్కొన్నారు.
ఇది దక్షిణ ఒడిశా, ఉత్త రాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అల్పపీడనంతో పాటు, ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం, ఈశాన్య ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాల్లో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.