టైంబాంబును తలపిస్తున్న తమిళనాడు... కూవత్తూరులోనే శశికళ
అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు క్లైమాక్స్కు చేరుకుంది. ఇప్పటివరకు నిరువుగప్పిన నిప్పులా ఉన్న ఈ రాజకీయాలు... మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబును త
అధికార అన్నాడీఎంకేలో చెలరేగిన ఆధిపత్య పోరు క్లైమాక్స్కు చేరుకుంది. ఇప్పటివరకు నిరువుగప్పిన నిప్పులా ఉన్న ఈ రాజకీయాలు... మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఏ క్షణమైనా పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్ బాంబును తలపిస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తమిళనాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చని కేంద్ర హోం శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. ప్రత్యేకంగా శశికళ, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మకాం వేసిన రిసార్టు చుట్టూ ఏకంగా 25 వాహనాలను, 600 మంది పోలీసులు కమ్ముకొని సిద్ధంగా ఉన్నారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అడ్డుకోవడానికి అప్రమత్తంగా ఉన్నారు. రాష్ట్ర రాజధాని చెన్నైలో కీలక ప్రాంతాల్లో పోలీసులను మొహరించారు. అలాగే, ఈసీఆర్ రోడ్డును పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రహదారిలో వాహనాలను కూడా క్రమబద్ధీకరించారు.
ముఖ్యంగా రాష్ట్ర రాజధాని చెన్నైలో, జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలను భారీగా మోహరించారు. సుప్రీంకోర్టు శశికళకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించినా, గవర్నర్ ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా ఆమె అనుచరులు రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడవచ్చని హోం శాఖ రాష్ట్ర పోలీస్ శాఖను హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ తదితరులు సమాలోచనలు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు.