పశ్చిమ బెంగాల్లో ఇద్దరమ్మాయిల ప్రేమ కథ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లైనా నెల రోజులకే భర్తకు షాకిచ్చి.. ప్రేయసితో నవ వధువు పరారైంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్, ఫలకాటా ప్రాంతానికి చెందిన ఓ యువతి కూచ్ బిహార్ జిల్లాలోని తుఫాన్గంజ్ ప్రాంతానికి చెందిన మరో యువతితో ప్రేమలో పడింది.
రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి.. ఆపై ఒకరినొకరు వీడి వుండలేని పరిస్థితికి చేరుకున్నారు. విషయం తెలిసిన ఓ అమ్మాయి తల్లిదండ్రులు కుమార్తెకు అప్పటికప్పుడు సంబంధం కుదిర్చి వివాహం జరిపించారు. అక్కడితో సమస్యకు చెక్ పెట్టినట్లైందని అందరూ అనుకున్నారు.
కానీ అక్కడే అసలు సంగతి మొదలైంది. వారి ఆశలు ఫలించలేదు. పెళ్లైన నెల రోజులకే భర్తను కాదని కొత్తగా పెళ్లైన వధువు ప్రేయసితో కలిసి పారిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మాల్దాలోని ఓ హోటల్లో గది అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టారు. సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
వారొచ్చి ప్రశ్నించినా వెనక్కి తగ్గలేదు. తమ సంబంధాన్ని అంగీకరించాలని లేకుంటే కోర్టు గడప తొక్కుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ మాల్దా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు.