Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కాటుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత

కరోనా కాటుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కన్నుమూత
, గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:14 IST)
కరోనా కాటుకు ఇప్పటికే అనేక సెలెబ్రిటీలు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, పేరుమోసిన వైద్యులు మృత్యువాతపడుతున్నారు. తాజాగా ప్రముఖ గాయకుడు మృతి చెందారు. ఆయన పేరు నిర్మల్ సింగ్ ఖల్సా. వయసు 62 యేళ్లు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. గుర్బానీ గాయకుడు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయ మాజీ హజూరీ రాగి. ఈయన కరోనా వైరస్ బారినపడి గురువారం ఉదయం కన్నుమూశారు. 
 
ఈయన ఇటీవల విదేశాలకు వెళ్లి స్వదేశానికి వచ్చారు. ఆయనకు మార్చి 30వ తేదీన శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 
 
బుధవారం సాయంత్రం నుంచి నిర్మల్‌ సింగ్‌ ఖల్సాకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే గురువారం ఉదయం 4:30 గంటలకు నిర్మల్‌ సింగ్‌ మృతి చెందినట్లు పంజాబ్‌ విపత్తు నిర్వహణ ప్రత్యేక అధికారి కేబీఎస్‌ సిద్ధూ తెలిపారు. 
 
మార్చి 19వ తేదీన చండీఘర్‌లోని నిర్మల్‌ నివాసంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలకు కుటుంబ సభ్యులతో పాటు పలువురు హాజరయ్యారు. అయితే నిర్మల్‌ భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు, డ్రైవర్‌తో పాటు మరో ఆరుగురికి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిర్మల్‌ సింగ్‌ 2009లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పంజాబ్‌లో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46కు చేరుకుంది. 
 
కాగా, పంజాబ్‌లో ఇది ఐదో మరణం కాగా, అమృత్‌సర్ జిల్లాలో మరణించిన తొలి వ్యక్తి ఖల్సాయే. అంతకుముందు హోషియార్‌పూర్‌కు చెందిన కరోనా పాజిటివ్ రోగి అమృత్‌సర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దేశంలో 'కరోనా' అనే పదం ఉచ్ఛరిస్తే జైలుకే... ఎక్కడ?