Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

Advertiesment
vijay rupani

ఠాగూర్

, గురువారం, 12 జూన్ 2025 (21:53 IST)
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఏI171, అహ్మదాబాద్ నుంచి లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాద సమయంలో రూపానీ విమానంలోని బిజినెస్ క్లాస్ సీటు 2డిలో కూర్చొని ప్రయాణించారు. 
 
కాగా, విజయ్ రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబరు 2021 వరకు గుజరాత్ 16వ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. తన ప్రశాంత స్వభావం, దృఢమైన పరిపాలనాశైలితో పేరుపొందిన ఆయన, రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి, కోవిడ్ అనంతర పరిస్థితుల నుంచి కోలుకుంటున్న కీలక సమయంలో గుజరాత్‌ను సమర్థవంతంగా నడిపించారు. ఆయన పాలనలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
 
1956 ఆగస్టు 2వ తేదీన అప్పటి బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని రంగూన్ (ఇప్పుడు యాంగూన్)లో జన్మించిన విజయ్ రూపానీ, ఆగ్నేయాసియా దేశంలోని రాజకీయ అస్థిరతల కారణంగా తన కుటుంబంతో కలిసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వలస వచ్చారు. సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టాలు పొందిన ఆయన, ఆర్ఎస్ఎస్‌లో చురుగ్గా పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 
 
1987లో రాజ్ కోట్ మున్సిపల్ కార్పొరేటర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1996 నుంచి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రూపానీ, పలుమార్లు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బీజేపీ పట్ల ఆయనకున్న విధేయత, నిష్కళంకమైన ప్రతిష్ట ఆయనను గుజరాత్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ క్రమంలోనే, ముఖ్యమంత్రి పదవి నుంచి ఆనందిబెన్ పటేల్ వైదొలగడంతో, ఆగస్టు 2016లో ఆయన వారసుడిగా రూపానీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి