పుణ్యభూమిగా భాసిల్లే ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని రిషికేశ్ (Rishikesh)లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆపివున్న స్కూటర్ను ఎద్దు ఒకటి రైడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతూ, ముక్కున వేలేసుకుంటున్నారు.
రిషికేశ్లో ఓ రహదారి జనసంచారం లేకుండా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఎద్దు... కొద్దిసేపు అటూ ఇటూ తిరిగి రోడ్డు పక్కన నిలిపివున్న ఓ స్కూటర్ వద్దకు చేరింది. ఎవరూ ఊహించని విధంగా అది ఒక్కసారిగా స్కూటర్ మీదకు ఎక్కి సీటుపై కూర్చొంది.
అంతటితో ఆగకుండా తన కాళ్లతో స్కూటర్ను నెమ్మదిగా ముందుకు కదిలించింది. సాధారణంగా జంతువులు, ముఖ్యంగా పశువులు ఇలా వాహనాలపైకి ఎక్కడం లేదా వాటితో విన్యాసాలు చేయడం ఉండదు. కానీ, ఈ ఎద్దు ప్రవర్తన అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై జరిగిన ఈ విచిత్ర సంఘటన తాలూకా వీడియో దృశ్యాలు ఇపుడు వెలుగులోకి రావడంతో అవి వైరల్ అయ్యాయి.