Publish Date: Thu, 02 Apr 2020 (11:52 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (14:34 IST)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల మధ్య లక్షలాది మంది పేదలు నివాసం వుంటారు. ఇక్కడ పారిశుద్ధ్యం మాటెత్తితే అంతేసంగతులు. అదే ముంబైలోని మురికివాడ ప్రాంతం ధారావి. ఈ ప్రాంతంలో ఓ కరోనా మరణం సంభవించింది.
ధారావి వంటి ప్రాంతంలో కరోనా ప్రబలితే, దానిని అడ్డుకునే పరిస్థితి చాలా కష్టమని అధికారులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం ధారావి ప్రాంతంలో దాదాపు 16 లక్షల మంది నివాసం ఉంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 59 కరోనా కేసులు బయటపడగా, ఆరుగురు మరణించారు.
ఈ నేపథ్యంలో ధారావిలో బుధవారం సాయంకాలం కరోనా తొలి మరణం నమోదైంది. కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న అతని రక్త నమూనాలను పరీక్షించగా, పాజిటివ్ వచ్చింది.
అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన వెళ్లి అతను ఉంటున్న భవనాన్ని సీల్ చేసి, భవనంలో అద్దె కుంటున్న 300 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, ఆగ్రహంతో వారిపై రాళ్లు కూడా రువ్వడం జరిగింది.