Publish Date: Fri, 15 Jul 2022 (17:34 IST)
Updated Date: Fri, 15 Jul 2022 (17:37 IST)
విద్యార్థులకు వడ్డించాల్సిన పోషకాహారంపై మోదీ సర్కారు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ రూపొందించిన పత్రం తప్పుల తడకగా ఉండటమే కాకుండా అసలుకే ఎసరు పెట్టేలా ఉంది. ఇటీవల వెలుగు చూసిన ఆ పత్రంలో ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి.
గుడ్లు, మాంసం పిల్లల మెనూ నుంచి తొలగించాలని నిపుణుల కమిటీ సూటిగానే సూచించింది. మెనూ మార్చడమే కాకుండా పిల్లలకు అశాస్త్రీయమైన భోజన విధానాలపై పాఠ్యాంశాలు కూడా రూపొందించాలని సిఫార్సు చేశారు.
ఎనిమిది మంది నిపుణుల్లో స్కూలు టీచరు గానీ, తల్లిదండ్రుల ప్రతినిధులు గానీ లేకపోవడం గమనార్హం. 'మధ్యాహ్న భోజన ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు అందులో కొలెస్టరాల్ లేకుండా చూడాలి. గుడ్ల వంటివి కలపడం మానుకోవాలి. రుచికరమైన పదార్థాలు కలిపిన పాలు, బిస్కట్లు లేకుండా చూడాలి. అధిక కెలోరీలు, కొవ్వు వల్ల ఊబకాయం, హార్మోన్ అసమతూకం రాకుండా చూసేందుకు వీటన్నిటినీ నివారించాలి.
గుడ్లు, మాంసం తరచుగా తినడం వల్ల లభించే కొలెస్టరాల్ మధుమేహం, ముందస్తు రుతుస్రావం, పిల్లలు కలగకపోవడం వంటి జీవన విధాన జాడ్యాలకు కారణమవుతుంది. మాంసం వల్ల హార్మోనల్ అసమతౌల్యం ఏర్పడుతుందని చాలా దేశాల్లో జరిపిన అధ్యయనాల్లో రుజువైంది' అని పత్రంలో ఒకచోట రాసి ఉంది.