Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రంక్ అండ్ డ్రైవ్.. వివాహితను ఢీకొట్టి... ప్రియురాలి ఇంట్లో నక్కిన నిందితుడు...

drunk and drive

వరుణ్

, సోమవారం, 8 జులై 2024 (17:09 IST)
పీకల వరకు మద్యం సేవించి కారు నడపడమే కాకుండా రోడ్డుపై నడిచి వెళుతున్న ఓ వివాహితను కారుతో ఢీకొట్టించాడు. ఆ తర్వాత పోలీసులకు చిక్కకుండా తన ప్రియురాలి ఇంట్లో నక్కి, ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన శివసేన (షిండే వర్గం) నేత కుమారుడు కావడం గమనార్హం. ఈ హిట్ అండ్ రన్ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో వివాహిత కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త గాయపడ్డారు. 
 
అయితే, ప్రమాదం తర్వాత మిహిర్ ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేరుగా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు పరారైనట్లు నిర్ధారించారు. నిందితుడి గర్ల్ ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
 
కాగా, మిహిర్ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశముందని అనుమానించిన పోలీసులు అతడిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడి కోసం ఆరు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్ జుహూ ప్రాంతంలోని ఓ బారులో పీకల వరకు మద్యం సేవించినట్టు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తెలిపారు. 
 
ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్ కూడా ఉన్నాడు. బార్ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్ సీట్లోకి మారినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతుంది. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, శివసేన యువనేత మిహిర్ షా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్ యూజీ ప్రవేశ పరీక్షల రుద్దు చివరి అస్త్రం : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు