కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మంగోలిలోని ఓ కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు. మొత్తం 59 కేజీల తాకట్టు బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి.నింబార్గి మీడియాకు తెలిపారు.
మే 26న కెనరా బ్యాంకు మేనేజర్ దీనిపై ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. మే 23న సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారని, ఆ తర్వాత రెండు రోజులు నాలుగో శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు మూసి ఉందన్నారు. మే 26న బ్యాంకు గుమాస్తా వచ్చి శుభ్రం చేసేందుకు తెరవగా షట్టర్ తాళం కట్ చేసి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.
ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడినట్లు వెల్లడైందని, మొత్తంగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుని ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ వెల్లడించారు.