సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలి అరెస్టుకు కారణమైన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వజాహత్ ఖాన్పై ఇపుడు వరుసగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో ఆయన హిందువులను కించపరిచేలా మాట్లాడారని పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, హిందువులు యూరిన్ డ్రింకర్స్, రేపిస్ట్ కల్చర్స్ అంటూ కామెంట్స్ చేశారంటూ, అందువల్ల ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీరామ్ స్వాభిమాన్ పరిషత్ అనే సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా వేదికగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పలు సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువులను రేపిస్ట్ కల్చర్స్, యూరిన్ డ్రింకర్స్ వంటి పదజాలంతో కించపరిచాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, లైంగిక అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడని, హిందూ మత సంప్రదాయాలు, దేవాలయాలను, పండుగలను అపహాస్యం చేశాడని ఆరోపించారు. మత ఘర్షణలను ప్రేరేపించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం, మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే కంటెంట్ను వజాహత్ ఖాన్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.