Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప ఎన్నికల పోలింగ్ అప్డేట్స్... దుబ్బాకలో పోలింగ్ శాతమెంత?

ఉప ఎన్నికల పోలింగ్ అప్డేట్స్... దుబ్బాకలో పోలింగ్ శాతమెంత?
, మంగళవారం, 3 నవంబరు 2020 (11:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి మంగళవారం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్‌ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు.
 
ఇదిలావుండగా, లచ్చపేటలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హొళికెరి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతం నివేదికను పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా 104 పోలింగ్‌ కేంద్రాలను పోలింగ్‌ తీరును పరిశీలించారు. 
 
మరోవైపు, బీహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతోన్న ఉప ఎన్నికల్లో ఓటరు చైతన్యం కనపడింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పోలింగ్ కేంద్రంలో ఓ వ్యక్తి తన తల్లిని చేతుల మీద ఎత్తుకొచ్చి ఓటేయించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ రోజు మొత్తం 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
 
హర్యానాలో ఓ వ్యక్తి తన తండ్రిని తన వీపుపై మోసుకుని భైన్స్వాల్ కలాన్ ఓటింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేయించాడు. కాగా, బీహార్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం ఉదయం 9 గంటలలోపు 8.05 శాతం ఓటింగ్ నమోదయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో పాతబస్తీ వాసి దారుణ హత్య... ఎందుకని?