వరకట్న వేధింపులు సరికొత్త రూపందాల్చాయి. కట్నం కింద కిడ్నీ ఇవ్వాలని కోడలికి అత్తామామలు చిత్ర హింసలకు గురిచేశారు. అయినప్పటికీ ఆమె కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమెపై దాడి చేసి గాయపరిచారు. ఈ దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే,
బీహార్ రాష్ట్రం, ముజఫర్పూర్ జిల్లాలోని మిఠన్పురా ప్రాంతానికి చెందిన దీప్తికి 2021లో బోచహాన్ ప్రాంతానికి చెందిన యువకుడుతో వివాహం జరిగింది. పెళ్ళయిన కొత్తలో అంతా సవ్యంగానే జరిగింది. అయితే, కొన్ని రోజులకే అత్తమామల నిజస్వరూపం బయటపడింది. పుట్టింటి నుంచి అదనంగా డబ్బు, ఒక బైకు తీసుకునిరావాలంటూ దీప్తిని వేధించసాగారు. ఈ వేధింపులు కొనసాగుతుండగానే భర్తకు కిడ్నీ సమస్య ఉత్పన్నమైంది.
దీంతో తమ కుమారుడు అనారోగ్యంతో అత్తమామల వేధింపులు కొత్తరూపం సంతరించుకున్నాయి. అదనపు కట్నానికి బదులుగా తమ కుమారుడు ప్రాణాలు రక్షించుకునేందుకు కిడ్నీ ఇవ్వాలంటూ ఒత్తిడి చేశారు. దీనికి కోడలు అంగీకరించకపోవడంతో ఆమెను దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి చేరుకున్న దీప్తి... తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి, పోలీసులకు ఫిర్యాదుచేసింది.
ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఆమె భర్త, అత్తమామలతో సహా మొత్తం నలుగురుని నిందితులుగా చేర్చామని, వరకట్న వేధింపులు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందని జిల్లా రూరల్ ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.