కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో కేసు నమోదైవుంది. ఈ కేసులో డిసెంబరు రెండో తేదీన వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశించింది.
కాగా, ఆయన కీలక పదవిలో ఉన్న సమయంలో సాయం కోసం తన వద్దకు వచ్చిన ఓ బాలికను యడ్యూరప్ప లైంగికంగా వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. ఇది గత 2024 ఫిబ్రవరి 2వ తేదీన జరిగింది. బాధితురాలి తల్లి సదాశివనగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో యడియూరప్పతో పాటు అరుణ, ఎం.రుద్రేశ్, మరిస్వామి అనే మరో ముగ్గురుని కూడా నిందితులుగా చేర్చారు. వారికి సైతం కోర్టు సమన్లు పంపింది.
తాజాగా జరిగిన జరిగిన విచారణలో ఫిర్యాదిదారుల తరపున ప్రత్యేక ప్రాసిక్యూటర్ అశోక్ ఎస్.నాయక్ వాదనలు వినిపించారు. వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సుజాత, 30 రోజుల్లోగా సాక్షుల విచారణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశిస్తూ ఈ సమన్లు జారీ చేశారు.
కాగా, తనపై నమోదైన పోక్సో కేసును, సమన్లను రద్దు చేయాలని కోరుతూ యడియూరప్ప దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రత్యేక కోర్టు తాజా ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.