Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అష్టదిగ్బంధం చేస్తామంటూ రైతుల హెచ్చరిక : అర్థరాత్రి కీలక భేటీ!

అష్టదిగ్బంధం చేస్తామంటూ రైతుల హెచ్చరిక : అర్థరాత్రి కీలక భేటీ!
, సోమవారం, 30 నవంబరు 2020 (11:29 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇందులోభాగంగా, ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టాయి. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల రైతులు కలిసి ఢిల్లీకి వెళ్లే రహదారులను దిగ్బంధించారు. అంతేకాకుండా ప్రభుత్వం దిగిరాకుంటే ఢిల్లీని అష్టదిగ్బంధనం చేస్తామంటూ హెచ్చరికలు చేశారు. పైగా, ఈ ఉద్యమం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. 
 
ఢిల్లీలో అర్థరాత్రి కీలక భేటీ నిర్వహించారు. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలతో పాటు.. మరికొందరు మంత్రులున్నారు. ఢిల్లీ వేదికగా రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఏం చేద్దాం అన్నదానిపైనే ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. ఢిల్లీని అష్టదిగ్బంధనం చెస్తామంటూ రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 
 
అంతేకాకుండా హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రంగా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు. రైతులు పట్టువిడవకుండా బైఠాయించడంతో కేంద్రంలో కదలిక మొదలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను లైలా.. వారంతా మజ్నూలా.. నా చుట్టూ తిరుగుతున్నారు.. అమిత్ షా