హనీమూన్లో వెళ్లిన జంట అదృశ్యం కావడం, ఆ తర్వాత భర్తను నవవధువే హత్య చేయించిందన్న వార్త తనకు నమ్మశక్యంగా లేదని మేఘాలయ ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ త్యాన్సాంగ్ అన్నారు. పర్యాటకులను తమ రాష్ట్ర సురక్షితమైన ప్రాంతమని చెప్పారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్కు చెందిన రాజా రంఘవంశీ, తన భార్య సోనమ్తో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో భర్త మృతదేహం జూన్ 4వ తేదీన బయటపడగా భార్య కోసం ముమ్మరంగా గాలిస్తున్న వేళ ఆమె యూపీ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అసలు విషయం బయటపడిన విషయం తెల్సిందే.
సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి సుపారీ గ్యాంగ్తో గ్యాంగ్తో భర్తను చంపించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో పోలీసులు సోనమ్ ప్రియుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
దీనిపై మేఘాలయ డిప్యూటీ సీఎం స్పందిస్తూ, ఈ ఘటన గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది నాకు నమ్మశక్యం కాలేదు. తొలుత నాకు సమాచారం రాగానే, ఇది నిజమని అనుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరపున ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా... పర్యాటకులకు మేఘాలయ సురక్షితమైన ప్రదేశం, దయజేసి రండి. సురక్షితం ప్రదేశం కాదంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేశారు. కానీ, నన్ను నమ్మండి. పర్యాటకులకు ఇది సురక్షితమైన రాష్ట్ర అని అన్నారు.