ఉత్తరాఖండ్ రాష్ట్రలోని రుద్రప్రయాగ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 18 మంది ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు ఒకటి అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, మరో పది మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి ఏడుగురుని రక్షించారు. అలాగే, స్థానికులు మానవహారంగా నిలబడి గాయపడిన వారని కొండపైకి చేర్చారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. బస్సు కొండపైకి వెళుతున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చపేట్టారు. వీరిలో నదిలో నుంచి రక్షించిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నదిలో గల్లంతైన మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.