అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదం జరిగి కనీసం 15 రోజులు కూడా కాలేదు. ఇంకా చాలా కుటుంబాలు విమాన ప్రమాదంలో మరణించిన తమవారి ఆచూకి తెలిపే డిఎన్ఎ రిపోర్టులు సరిపోలడంలేదు. చాలా కుటుంబాలు తమ ప్రియమైన వారిని చివరిసారిగా చూడలేకపోయాయి. ఇంకా అనేక మృతదేహాలను అప్పగించలేదు.
ప్రమాదంలో మరణించినవారి ఇళ్లలో తీవ్ర విషాదం అలుముకుని వుంది. అంత్యక్రియలు కూడా జరిపించేందుకు తమవారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లేందుకు కూడా లభించలేదు. ఇలాంటి సమయంలో ఈనెల 20న, ఎయిర్ ఇండియా SATS SVP సంప్రీత్ కోటియన్, COO అబ్రహం జకారియా కార్యాలయంలో డిజె పార్టీని నిర్వహించారు. ఎంతో సంతోషంగా చిందులేస్తూ పార్టీ చేసుకున్నారు. ఆ రోజు కంపెనీ CFO కూడా అక్కడే ఉన్నారు.
ఒకవైపు ఘోర విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఇలాంటి డీజే పార్టీలు చేసుకుంటూ చిందులు వేయడం ఏంటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ వీడియో వైరల్ కావడంతో ఏఐసాట్ అధికారులు స్పందించారు. ఇదేదో కావాలని చేయలేదని, రెండు కంపెనీలకు చెందిన అధికారులు సమావేశం జరిగినప్పుడు అనుకోకుండా అలా అయిపోయిందనీ, ఈ వీడియో విషయం మా దృష్టికి వచ్చిందనీ, దీనిపట్ల తీవ్రంగా చింతిస్తున్నామంటూ పేర్కొన్నారు.