ఎయిరిండియా విమానం ఇటీవలే అహ్మాదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు తప్ప అంతా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే జూన్ 1న ఎయిరిండియా విమానం బోయింగ్ 787 ఫ్లైట్ గాల్లో ప్రయాణిస్తున్న గంట తర్వాత విమానం తలుపు ఊగుతూ కిర్రుకిర్రు మంటూ శబ్దం వచ్చిందట. ఢిల్లీ నుంచి హాంగ్ కాంగ్ వెళ్తున్న ఈ విమానం తలుపు ఇలా కిర్రు శబ్దం చేస్తుండటంతో ప్రయాణికులు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఆందోళన చెందారట.
ఐతే ఎయిర్ హోస్టెస్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ తన వద్ద వున్న న్యాప్కిన్స్ తీసుకుని కిర్రుకిర్రుమంటూ ఎక్కడ శబ్దం వస్తుందో అక్కడ వీటిని గట్టిగా నొక్కిపెట్టి ప్లాస్టర్ వేసిందట. దాంతో తాత్కాలికంగా ఆ శబ్దం ఆగిపోయిందట. చివరికి సురక్షితంగా విమానం హాంగ్ కాంగ్లో ల్యాండ్ అయ్యిందట. ఈ విషయం ఎయిర్ ఇండియా అధికారుల దృష్టికి రావడంతో విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే టేకాఫ్ అనుమతిస్తామంటూ చెప్పారు. అంతేకాదు, ప్రయాణికుల భద్రత తమకు ఎంతో ముఖ్యమనీ, కనుక విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసాక మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని చెప్పారు. హాంగ్ కాంగ్ నుంచి తిరుగుప్రయాణంలో ఎయిర్ ఇండియా విమానం తలుపుకి మరమ్మతులు చేయడంతో ఎలాంటి శబ్దం చేయకుండా ఢిల్లీకి వచ్చిందట.
కాగా ఎయిర్ ఇండియా విమానాల మెయింటెనెన్స్ విషయంలో తీవ్రమైన అలసత్వం ఆవహించిందంటూ ఇటీవల మాజీ ఉద్యోగులు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాసారు. మరోవైపు ఎయిరిండియాకి చెందిన ముగ్గురు సీనియర్ అధికారులను తక్షణమే విధుల నుంచి తప్పించాలని విమానయాన శాఖ తాజాగా ఆదేశించింది.