అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కూలిపోయిన స్థలం నుంచి డీవీఆర్ (డీజిటల్ వీడియో రికార్డర్)ను ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమాన ప్రమాద స్థలంలో ఉన్న శకలాల నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీన్ని ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించిన తర్వాతే వివరాలు తెలుస్తాయని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు తెలిపారు. అలాగే. విమానం బ్లాక్ బ్లాక్స్ను డీకోడ్ చేస్తే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని విమానరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 241 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. దేశంలో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు కేంద్ర విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తొలుత తాత్కాలికంగా సేవలను నిలిపివేసి, ఆ తర్వాత భద్రతను సమీక్షించిన తర్వాత ఈ విమానం సేవలను పూర్తిగా నిలిపివేయాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భారత్, అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా తాజాగా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిరిండియాతోపాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విమాన ప్రయాణికులు 241తో కలిపి మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన గగనతలంలో ప్రమాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినపుడు బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్లు సాంకేతికత, భద్రత, వేగం, ఇంధన వినియోగం పరంగా అత్యున్నమైనవనే అభిప్రాయం ఉంది. కానీ, అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంలో ఈ విమానాల భద్రతపై ఇపుడు అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.