అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషాదకర ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన అనేక విమానాల్లో సాంకేతిక సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రతి ఏదో ఒక విమానంలో సాంకేతిక లోపం తలెత్తుతోంది. ఈ లోపాన్ని పైలెట్లు సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి.
తాజాగా జైపూర్ నుంచి ముంబైకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన పైలెట్లు టేకాఫ్ అయిన 18 నిమిషాల్లోనే విమానాన్ని వెనక్కి మళ్లించి ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం సురక్షితంగా టేకాఫ్ అయిన ప్రదేశంలోనే ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది, ఇద్దరు పైలెట్లు, కొందరు వైద్య విద్యార్థులంతా కలిసి దాదాపు 275 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎయిరిండియా విమానాల్లో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు అధికారులు వెల్లడించారు. మరో సంఘటనలో హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానం ఏ1 315 ల్యాండింగ్ అయిన వెంటనే పవర్ యూనిట్లో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది.