ఇకపై ఆధార్ కార్డు తన స్వరూపాన్ని పూర్తిగా మార్చుకోనుంది. ఫోటో, క్యూఆర్ కోడ్తో మాత్రమే కనిపించనుంది. వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) సీఈఓ భువనేశ్ కుమార్ వెల్లడించారు. బ్యాంకులు, హోటళ్లు, ఫిన్టెక్ సంస్థల ప్రతినిధులతో ఆన్లైనులో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
'ఆధార్ కార్డుపై అనవసరమైన వివరాలు ఎందుకుండాలి? అనే ఆలోచనతోనే ఈ మార్పులు చేస్తున్నాం. డిసెంబరులోగా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం' అని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అనేక సంస్థలు ఆఫ్లైన్ ధ్రువీకరణ పేరుతో ఆధార్ కార్డు ఫొటో కాపీలను తీసుకుని భద్రపరుస్తున్నాయని, ఇది ఆధార్ చట్టానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఇలాంటి ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్దతులను నివారించేందుకు వీలుగా ఉడాయ్ చర్యలు తీసుకోనుంది. ఆధాప్ను ఒక డాక్యుమెంటులా కాకుండా, క్యూఆర్ కోడ్ లేదా నంబరు ద్వారా ధ్రువీకరించాలని ఆయన సూచించారు.
ఈ మార్పులతో పాటు సరికొత్త యాప్ను కూడా ఉడాయ్ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతమున్న ఎం-ఆధార్ యాప్ స్థానంలో రానున్న ఈ కొత్త యాప్లో 'ఫేస్ అథెంటికేషన్' ఫీచర్ ఉంటుంది. దీని సాయంతో వినియోగదారులే స్వయంగా తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను సులభంగా మార్చుకోవచ్చు.