Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్ నివేదిక

Advertiesment
lok sabha house

వరుణ్

, శుక్రవారం, 29 మార్చి 2024 (17:37 IST)
ప్రస్తుత లోక్‌సభలో 515 మంది సిట్టింగ్ ఎంపీల్ల 225 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏడీఆర్‌ పలు వివరాలతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. ఎంపీల్లో 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైమాటగానే వుంది. 
 
క్రిమినల్‌ కేసులు నమోదైన వారిలో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు భాజపాకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది భాజపాకి చెందినవారే కావడం గమనార్హం. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. 
 
మరోవైపు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలలోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్‌ తేల్చింది. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన నకుల్‌నాథ్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్‌ (కాంగ్రెస్‌), కనుమూరు రఘురామ కృష్ణరాజు (ఇటీవల వైకాపాకి రాజీనామా చేశారు) ఉన్నారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలపైనే ఎక్కువగా క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ విశ్లేషణలో తేలింది. ఆయా రాష్ట్రాల్లో సగానికిపైగా ఎంపీలపై కేసులున్నాయి. ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. 73శాతం మంది ఎంపీలు గాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లు వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో కేవలం 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ రాజకీయాల్లో నిజమైన జంపింగ్ స్టార్ ఎవరో తెలుసా?