Publish Date: Wed, 17 Apr 2019 (18:12 IST)
Updated Date: Wed, 17 Apr 2019 (18:14 IST)
పౌష్టికాహార లోపం వల్ల బలహీనంగా ఉండే పిల్లలను చాలా మందిని చూసుంటాం. సరైన ఆహారం తినకపోవడం వల్ల సన్నగా తయారవ్వడం, చలాకీతనం లేకపోవడం, ఎదుగుదల సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. వీటికితోడు నిరుత్సాహం, బద్దకం కూడా అంటుకుంటాయి. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలు మంచి ఆహారం తీసుకోకపోతే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకి విటమిన్ ఎ బాగా ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, ఎముకలకు బలాన్ని ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా క్యారట్, చీజ్, పాలు, గుడ్డులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తింటే మంచిది. టమోటాలు, తాజా కూరగాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ధృడత్వానికి, అందమైన చర్మాన్ని పొందటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మజాతి పండ్లను పిల్లలకు తరచూ ఇస్తుండాలి. పిల్లలలో రక్తం పట్టడానికి ఐరన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందుకోసం పాలకూర, ఎండుద్రాక్ష, బీన్స్ వంటివి తరచూ పిల్లలకు పెట్టాలి. దీని వలన పిల్లలు ఎంతో ఉత్సాహంగా తయారవుతారు. పిల్లలకు సరైన పోషకాహారం ఇవ్వడం వలన ఆరోగ్యంగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువులు, ఆటల్లో రాణించగలుగుతారు.