Publish Date: Mon, 04 Mar 2019 (12:44 IST)
Updated Date: Mon, 04 Mar 2019 (14:19 IST)
పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. పిల్లలకంటే.. పెద్దలే ఎక్కువగా భయపడుతుంటారు. పిల్లల్ని పరీక్షలకు సన్నద్ధం చేయడం అనేది చిన్నప్పటి నుంచే అర్థమయ్యేలా, నెమ్మదిగా నేర్పించాలి. అప్పుడే పెద్దయ్యాక సమస్య ఉండదు. తమకు తాముగా చదువుకునే నైపుణ్యం అలవడుతుంది. కొందరైతే చెప్పిన మాట అసలు వినరు. మరికొందరు ఎదురు తిరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక ఎవరితో ఎలా వ్యవహరించాలనేది ఆయా సమయాన్ని బట్టి నిర్ణయించుకోవడం ఎంతైనా ముఖ్యం.
చదువుల్లో కొందరికి పెద్దవాళ్ల సహాయం అవసరం కావొచ్చు. మాటిమాటికీ సందేహాలు అడగొచ్చు. అలాంటప్పుడు ఎంత పని ఉన్నా కుడా సాయం చేయాలి. అప్పుడే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది. కొందరైతే తమకు తాముగానే చదువుకోవడానికి ఇష్టపడొచ్చు. కాబట్టి పిల్లల స్వభావాలను బట్టి మనమూ వ్యవహరించాలి.
కేవలం పాఠాలను, ప్రశ్న జవాబులను చదివినంత మాత్రాన సరిపోదు. చదివినవి గుర్తుంచుకోవాలి. అవి పరీక్ష రాసేటప్పుడు తిరిగి గుర్తుకురావాలి. కనుక చదువుకోవడం పూర్తయిక తరువాత ఆయా సబ్జెక్టుల్లో అక్కడక్కడా కొన్ని ప్రశ్నలను ఎంచుకుని పిల్లలను అడగాలి.
పరీక్ష జరిగే రోజు పిల్లలను పెందలాడే నిద్రలేపి, సిద్ధం చేయాలి. తేలికైన అల్వాహారం, పాలు, ఇవ్వాలి. కాసేపు సబ్జెక్టును పునశ్చరణ చేసుకోమని చెప్పాలి. ముఖ్యంగా మనసుకు విశ్రాంతి, హాయి భావన కలిగేలా గాఢంగా, నెమ్మదిగా శ్వాస తీసుకోవడం నేర్పించాలి. చివరగా అవసరమైన పెన్నులు, పరీక్ష అట్ట వంటివి బ్యాగులో పెట్టుకున్నారో లేదో చూడాలి. అలానే బాగా పరీక్ష రాయమంటూ ప్రోత్సహించాలి.