Publish Date: Thu, 11 Apr 2019 (14:18 IST)
Updated Date: Thu, 11 Apr 2019 (14:46 IST)
ఇప్పటి కాలంలో పిల్లలు చాలా తెలివిగా ఉన్నారు. మనం చెప్పే మాట వారు వినడం కంటే వారు చెప్పే మాటే మనం వినాల్సి వస్తుంది. పిల్లలు మనం చెప్పిన మాట వినాల్సిందంటే మొబైల్ చేతికివ్వాల్సిందే.. ముఖ్యంగా అన్నం తినిపించాలంటే చేతిలో ట్యాబ్ పెట్టాల్సిందే.. ఇంతగా ఎలక్ట్రానిక్ సాధనాలకు పిల్లలు అలవాటుపడడం వలన ఎన్నో సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి వాటిని మాన్పించాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
కంప్యూటర్, మొబైల్ తెరకంటే ఆనందాన్నిచ్చే అసలైన ఆటలు పిల్లలకు పరిచయం చేయాలి. ఆరుబయట ఆడితే ఎంత బాగుంటుందో చూపించాలి. స్నేహితులతో ఆడుకోవడం వలన ఎలాంటి విషయాలు నేర్చుకుంటారో ఎంత ఆనందంగా ఉంటుందో చవిచూపండి. అప్పుడే చిన్నారులు దారిలోకి వస్తారు.
ఎలక్ట్రానిక్ తెరా, దానిపై కదిలే రంగుల బొమ్మలు, అవి చూపే విన్యాసాలు, వాటి కదలికని చేతులారా నియంత్రించగలగడం, ఆ కదలిక ఇచ్చే ఆనందం.. ఇవే పిల్లలు వీడియోగేమ్లకు అతుక్కుపోవడానికి ముఖ్య కారణం. ఓసారి దానికి అలవాటుపడితే మిగిలినవేవీ ఆనందాన్నివ్వవు. దాంతో వాళ్లు బాహ్యప్రపంచానికి దూరమవుతారు. ఇక దీనివలన వాళ్లు స్నేహితుల మధ్య ఉన్నప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోవడం నేర్చుకోలేరు.