Publish Date: Wed, 20 Nov 2019 (11:36 IST)
Updated Date: Wed, 20 Nov 2019 (11:43 IST)
రిలయన్స్ జియో కూడా వొడాఫోన్, ఎయిర్టెల్ తరహాలో టారిఫ్ ఛార్జీలను పెంచే దిశగా సమాలోచనలు చేస్తోంది. అయితే ఈ పెంపుదలతో డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండనున్నట్లు జియో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే డిసెంబర్ 1 నుంచి వొడాఫోన్, ఎయిర్టెల్ టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
రెగ్యులేటరి నిబంధనలకు లోబడి టెలికాం పరిశ్రమను బలోపేతం చేసే చర్యల్లో తోడ్పాటు అందిస్తుందని, కస్టమర్ల విశ్వాసాన్ని కాపాడుతూనే, రానున్న చార్జీల సవరణల వల్ల డిజిటల్ విస్తృతి, డేటా వాడకంపై ప్రభావం చూపకుండా కృషి చేస్తామని జియో పేర్కొంది.
అలాగే రెగ్యులేటర్ నిర్ణయిస్తే చార్జీల సవరణ దృష్టి పెడతామని అందుబాటులో అందరికీ డేటా, డిజిటిల్ ఇండియా ప్రయత్నంలో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీల కింద జియో ఇప్పటికే నిమిషానికి ఆరు పైసల చొప్పున కస్టమర్ల నుండి వసూలు చేస్తోంది.