ఈద్-ఏ-మిలాద్-ఉన్-నబీ అంటే ఇస్లాం మత ప్రవక్త ముహమ్మద్ జన్మదినం. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇస్లాం సంవత్సరం ప్రారంభమైన మూడవ నెల రబీ-అల్-అవ్వల్లో పౌర్ణమి ముందురోజు ప్రవక్త పుట్టినరోజు వస్తుంది.
ఇస్లాం మతానుసారం పుట్టిన రోజు, పెళ్ళి రోజులను వేడుకలుగా జరుపుకోకూడదు. కాని భారతదేశంలో ఆయన పుట్టిన రోజున ప్రవక్తను స్మరించుకుంటూ ప్రార్థనలు జరుపుకుంటారు. భారతదేశంలోని ముస్లింలు తమ పండుగలను ప్రపంచవ్యాప్తంగానున్న ముస్లింలు జరుపుకునే రీతిలోనే ఈ పండుగను జరుపుకుంటుంటారు. కాని ప్రత్యేక పండుగలతోపాటు ఇక్కడ దర్గాలలోనున్న సాధువుల పుట్టిన రోజు లేదా వారి వర్ధంతిని ఘనంగా జరుపుకునే ఆచారం ఉంది.
FILE
భారతదేశంలోని ముస్లింలు ఇస్లాం క్యాలెండర్ననుసరించే పండుగలు జరుపుకుంటుంటారు. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తుంటారు. మత ప్రవక్త ముహమ్మద్ను స్మరించుకుని ఆయన చూపిన బాటలోనే నడిచేందుకు ప్రతి ముస్లిం సంకల్పం చేసుకుంటారు. ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రతి ముస్లిం ప్రార్థించడం గమనార్హం.
ఈ సందర్భంగా దేశంలోని ముస్లిం సోదరులందరూ ఫిబ్రవరి 27న దేశవ్యాప్తంగానున్న పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే కొన్ని ప్రాంతాలలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రవక్త చెప్పిన సూక్తులను వల్లెవేశారు. ఇదిలావుండగా రాష్ట్ర రాజధానిలో ప్రవక్త వాడిన టోపీ, తదితర వస్తువులను ప్రదర్శకు ఉంచారు. వీటిని తిలకించేందుకు రాష్ట్రంలోని పలువురు ముస్లింలు క్యూ కట్టారు.