మిలాదున్ నబీ
ముహమ్మద్ ప్రవక్త (స.అ.స) జన్మదినం
మక్కా పట్టణంలో 571వ సంవత్సరంలో ముహమ్మద్ ప్రవక్త(స.అ.స) జన్మించారు. ఈ సందర్భంగా మిలాదున్ నబీ పండుగను జరుపుకుంటారు. హజరత్ ముహమ్మద్ స.అ.స ఇస్లాం ధర్మాన్ని స్థాపించారు. ఈయన ఇస్లాం ధర్మంలో చివరి ప్రవక్త.
వీరి తర్వాత కయామత్ అంటే ప్రపంచపు చివరిరోజుల వరకు మరో ప్రవక్త పుట్టరు. మక్కా పర్వత క్షేత్రంలోని గుహ(దీనిని గార్-ఏ-హిరాహ్ అంటారు)లో ముహమ్మద్ ప్రవక్తకు అల్లాహ్ దూతలకు అధిపతియైన జిబ్రయిల్ అలైహి వసల్లమ్ దైవసందేశాన్ని(వహీ) వినిపించారు.
ఇస్లాంకు మునుపు అరబ్ ప్రాంతంలో సామాజికంగా, ధార్మికంగా చాలా క్లిష్ట పరిస్థితులతో కొట్టుమిట్టాడుతుండింది. అక్కడి ప్రజలు వివిధ రకాలుగా శిలువలను పూజించేవారు. చాలామంది వివిధ వంశస్థులు, వివిధ నియమాలు, చట్టాలను పాటించేవారున్నారు. పేద, బలహీన, బడుగు వర్గాలపై తరచూ దాడులు జరిగేవి. ముఖ్యంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది.
ఇలాంటి సందర్భంలో ముహమ్మద్ ప్రవక్త ఏకోపాసనపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చారు. అల్లాహ్ను ప్రార్థించమని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశుభ్రతను పాటించమని, దానికి కొన్ని నియమాలను పొందుపరిచారు. అలాగే ప్రజల ధన, మాన, ప్రాణాలను ఇస్లాం పరంగా కాపాడుకోవాలని ప్రజలకు ఉద్బోధించారు.
అల్లాహ్ దివ్య సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ప్రవక్త ఇచ్చిన అల్లాహ్ దివ్య సందేశం మక్కాలోని కొంతమందికి రుచించలేదు. దీంతో ప్రవక్తను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేయడం మొదలుబెట్టారు. దీంతో విసిగిపోయిన ప్రవక్త 622వ సంవత్సరంలో తన అనుచరులతో మక్కానుంచి మదీనాకు పయనమైనారు. దీనినే "హిజరత్" అంటారు.
630వ సంవత్సరంలో ప్రవక్త తన అనుచరులతో కలిసి కుఫ్ఫార్-ఏ-మక్కాతో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ప్రవక్త, ఆయన అనుచరులకు అల్లాహ్ అదృశ్య రూపంలో సహాయం చేశాడు. ఈ యుద్ధంలో ఇస్లాంను పాటించేవారు కాపాడబడ్డట్టు చరిత్ర చెబుతోంది. జంగ్-ఏ-బదర్ అని ఈ యుద్ధానికి పేరు.
చివరిగా 632వ సంవత్సరంలో ముహమ్మద్ ప్రవక్త(స.అ.స) ప్రపంచాన్ని వీడి పరలోకం చెందారు. అయన ఉన్నప్పుడే అరబ్ ప్రాంతమంతా ఇస్లాం ధర్మాన్ని పాటించే స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రవక్త చెప్పిన మార్గంలో తమ జీవితాన్ని గడిపే ముస్లింలు ఎందరో ఉన్నారు.