Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హతవిధి... అవమానకరంగా కేకేఆర్ ఆట... కోహ్లీ సేన విజయభేరీ

హతవిధి... అవమానకరంగా కేకేఆర్ ఆట... కోహ్లీ సేన విజయభేరీ
, బుధవారం, 21 అక్టోబరు 2020 (22:28 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న 13వ సీజన్ ఐపీఎల్ పోటీల్లో ఎన్నో ఆసక్తికర సంఘటనలు, సంచనాలు జరుగుతున్నాయి. కొన్ని జట్లు భారీ స్కారు సాధిస్తుంటే మరికొన్ని జట్లు అవమానకరంగా ఆడుతూ అత్యల్ప స్కోరుకే పరిమితమవుతున్నాయి. కొందరు ఆటగాళ్లు అటు బ్యాట్, ఇటు బంతితో రాణిస్తూ ఒంటి చేత్తో తమ జట్టును గెలిపిస్తున్నారు. డాషింగ్ బ్యాట్స్‌మెన్లు సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. అయితే, ఫ్రాంచైజీల్లో ఒకటైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అవమానకరరీతిలో ఆటతీరును ప్రదర్శించి అతి స్వల్ప స్కోరు చేసింది. 
 
అయితే, అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన టోర్నీ 39వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు ఆటతీరు అవమానకరంగా ఉంది. ఆర్సీబీ పేసర్ మహ్మద్‌ సిరాజ్‌(3/8), స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌(2/15) ధాటికి గజగజ వణికిపోయింది. వీరిద్దరి ధాటికి కోల్‌కతా ఓ దశలో 40 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌లో కూర్చున్నారు. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ 34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో చేసిన 30 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ముఖ్యంగా, సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులకే పరిమితమైంది. 2020 సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు.
 
తొలుత బ్యాటింగుకు దిగిన కేకేఆర్ జట్టు ఆది నుంచి వికెట్లను కోల్పోవడం ఆరంభించింది. అయితే, ఒకవైపు టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరుతున్నప్పటికీ.. ఇయాన్ మోర్గాన్‌ మాత్రం మొక్కవోని ధైర్యంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. మోర్గాన్‌ క్రీజులో ఉండటంతో కోల్‌కతా కనీసం 100 పరుగులైనా చేస్తుందని అనిపించింది. బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ ముందుకు సాగాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన 16వ ఓవర్‌ మూడో బంతిని ఫోర్‌ బాదిన మోర్గాన్‌.. తర్వాతి బంతికే మిడ్‌వికెట్‌లో గుర్‌కీరత్‌ సింగ్‌కు చిక్కి పెవిలియన్‌ చేరడంతో కోల్‌కతా సాధారణ స్కోరు కూడా చేయలేకపోయింది. 
 
ఆ జట్టు ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌(1), రాహుల్‌ త్రిపాఠి(1), నితీశ్‌ రాణా(0), టామ్‌ బాంటన్‌(10), దినేశ్‌ కార్తీక్‌(4), పాట్‌ కమిన్స్‌(4), కుల్దీప్‌ యాదవ్‌(12), ఫర్గుసన్‌(19 నాటౌట్‌) బ్యాటింగ్‌కు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. బెంగళూరు బౌలర్లలో నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌  చెరో వికెట్‌ పడగొట్టారు. హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. మ్యాచ్‌లో అతని సంచలన బౌలింగే హైలెట్‌. 
 
ఆ తర్వాత 85 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు... ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు పడిక్కల్ 17 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి 25 రన్స్ చేయగా, ఏజే ఫించ్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేశారు. అయితే, కమ్మిన్స్ అద్భుతమైన త్రో కారణంగా పడిక్కల్ రనౌట్ కాగా, ఫించ్ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో కీపర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరుకున్నాడు. ఓపెనర్లిద్దరూ ఔట్ అయ్యే సమయానికి ఆర్సీబీ స్కోరు 6.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు. ఆ తర్వాత గుర్గీరత్ సింగ్ 26 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 21 రన్స్ చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 17 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. ఫలితంగా 13.3 ఓవర్లలో 85 పరుగులు చేయడంతో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.
 
ఈ విజయంతో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించి 14 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. అయితే, ఢిల్లీ జట్టు కూడా 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. దీనికి కారణంగా ఆర్సీబీ కంటే ఢిల్లీ జట్టు నెట్ రన్‌రేట్ అధికంగా ఉండటంతో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించేవాళ్లకు అది వుండాలిగా..? భజ్జీ భార్య ఫైర్