ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూకంపం సంభవింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. ఈ కారణంగా ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్లోని మిందానావో ప్రాంతంలో సముద్ర గర్భంలో భూమి కంపించినట్టు గుర్తించారు. దీంతో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
ఫిలిప్పీన్స్ దేశ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9:43 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు ఆ దేశ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ ఇన్స్టిట్యూట్ (ఫివోల్ఫ్) అధికారికంగా ప్రకటించింది. మనాయ్ పట్టణానికి తూర్పున సుమారు 62 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. భూకంపం సంభవించిన కొన్ని గంటల పాటు సునామీ ప్రభావం ఉండవచ్చని ఫివోల్మ్స్ హెచ్చరించింది.
మరోవైపు యూఎస్ సునామీ హెచ్చరికల కేంద్రం కూడా భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాలను ప్రమాదకరమైన సునామీ అలలు తాకే ముప్పు ఉందని తెలిపింది. రాబోయే రెండు గంటల్లో పసిఫిక్ తీరంలో దాదాపు ఒక మీటరు ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ సీస్మాలజీ కార్యాలయం అంచనా వేసింది.
తొలుత యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ఓఎస్), యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) భూకంప తీవ్రతను 7.4గా నమోదు చేశాయి. అయితే, స్థానిక పరిస్థితులను అంచనా వేసిన ఫిలిప్పీన్స్ ఏజెన్సీ దానిని 7.6గా సవరించింది. పసిఫిక్ మహాసముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' ప్రాంతంలో ఫిలిప్పీన్స్ ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అయితే, ఈ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.