మయన్మార్ దేశంలో శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదైంది. ఒక్కసారిగా భారీభూకంపం రావడంతో పెద్దపెద్ద బహుళ అంతస్తు భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ నివాసాలు, కార్యాలయాలను వదిలి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన ఒళ్ళు గగుర్పొడిచే వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే, ఈ భారీ భూకంపం వల్ల జరిగిన ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది.
ఇక ఈ భూకంపం కారణంగా పొరుగున ఉన్న థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో కూడా తీవ్ర ప్రకంపనలు కనిపించాయి. దీంతో అక్కడ కొన్ని మెట్రో, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే, చైనాలోని యునాన్ ప్రావిన్స్లో కూడా ప్రకంపనలు సంభవించాయని బీజింగ్ భూకంప కేంద్రం వెల్లడించింది.