Publish Date: Thu, 01 Jul 2021 (08:46 IST)
Updated Date: Thu, 01 Jul 2021 (08:47 IST)
కెనడాలో సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ఇప్పటికే 240 మంది మృత్యువాతపడ్డారు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఇప్పటికే ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించడంతో పాటు అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.
వాంకోవర్లో పరిస్థితి మరింత భీతావహంగా ఉంది. ఇక్కడే సుమారు 135 మంది మృత్యువాతపడ్డారు. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు.
ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, బీచ్ల వద్ద ప్రజల సందడి అధికంగా ఉంది.
ఇక అమెరికాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా పోర్ట్ లాండ్, ఓరెగాన్, సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లో విద్యుత్కు డిమాండ్ పెరుగగా, సరఫరాకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వెస్ట్ యూఎస్లోని 4 కోట్ల మందిని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.
ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత కాలం పాటు అధికంగా నమోదు కావచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యూఎస్లోని 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఎయిర్ కండిషన్ సౌకర్యం ఉన్న సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్లో పూర్తి స్థాయిలో ప్రజలను అనుమతించాలని ఆ దేశ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాల0ు జారీచేసింది.