Publish Date: Wed, 04 Mar 2026 (13:53 IST)
Updated Date: Wed, 04 Mar 2026 (13:55 IST)
టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. ఇరాన్ రహస్యంగా నిర్మించిన అణు స్థావరాన్ని ధ్వంం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) అధికారింగా వెల్లడించింది. టెహ్రాన్ సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ కేంద్రం కాంపౌండ్పై దాడి చేసినట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు.
గత యేడాది జూన్ నెలలో తాము ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండు సామగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ నాలుగు రోజుల్లో ఇరాన్పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా.. అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని తమకు ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన 300 క్షిపణి లాంచర్లను తాకాయని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడులకు సంబంధించిన దృశ్యాలను ఐడీఎఫ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.