ఉత్తర కొరియాలో నాయకత్వ వారసత్వంపై కొత్త ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తూర్పు ఆసియా దేశ అత్యున్నత నాయకుడు తన టీనేజ్ కుమార్తె - కిమ్ జు-ఏ వారసురాలు కావచ్చని సూచించిన ఇటీవలి చర్యల తర్వాత ఈ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ, చట్టసభ సభ్యులు ఆమె పెరుగుతున్న బహిరంగ ప్రదర్శనలను హైలైట్ చేశారు. కిమ్ రాజవంశం భవిష్యత్తు గురించి ప్రాంతీయ నిపుణులలో చర్చను రేకెత్తించారు. కిమ్ వారసుడి గురించి గుసగుసలు నిజమైతే, అది అతని కుటుంబంలో వారసత్వ యుద్ధాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు అంటున్నారు.
యూకేలో దక్షిణ కొరియా రాయబారిగా, సియోల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన రాహ్ జోంగ్-యిల్ ప్రకారం, కిమ్ పదవిని చేపట్టడం జు-ఏకు అంత సులభం కాకపోవచ్చు అని టెలిగ్రాఫ్ నివేదించింది. ఉత్తర కొరియా సుప్రీం నాయకుడి 38 ఏళ్ల సోదరి కూడా రేసులో ఉందని, ఇప్పటికే సింహాసనంపై తన దృష్టిని పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
ఆమెకు సైన్యం, బ్యూరోక్రసీపై కూడా పెద్ద పట్టు ఉన్నందున, తూర్పు ఆసియా దేశంలో రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కూడా ఆమె పరిగణించబడుతుంది.
"ఇది సమయం మీద ఆధారపడి ఉంటుంది, కానీ కిమ్ యో-జోంగ్ తాను అగ్ర నాయకురాలిగా మారే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఆమె దానిని స్వీకరిస్తుందని నేను నమ్ముతున్నాను" అని జోంగ్-యిల్ చెప్పినట్లు ది టెలిగ్రాఫ్ ఉటంకించింది.