36 మంది చచ్చారు... అబ్బే ఒక్కడూ చావలేదు. ఏది సత్యం, ఏదసత్యం?
యుద్ధంలో మొట్టమొదట హతమయ్యేది సత్యమే అనే నానుడి ఇప్పటిది కాదు. శత్రువుకు కలిగించిన నష్టాలు, తనకు కలిగిన నష్టాలపై అసత్యాలు ప్రచారం చేయడం వేల సంవత్సరాలుగా యుద్ధనీతిలో భాగంగానే సాగుతోంది. ఇప్పుడు అమెరికా, ఐఎస్ సాగిస్తున్న ప్రచారం కూడా ఈ బాటలోనే నడుస్తోంద
యుద్ధంలో మొట్టమొదట హతమయ్యేది సత్యమే అనే నానుడి ఇప్పటిది కాదు. శత్రువుకు కలిగించిన నష్టాలు, తనకు కలిగిన నష్టాలపై అసత్యాలు ప్రచారం చేయడం వేల సంవత్సరాలుగా యుద్ధనీతిలో భాగంగానే సాగుతోంది. ఇప్పుడు అమెరికా, ఐఎస్ సాగిస్తున్న ప్రచారం కూడా ఈ బాటలోనే నడుస్తోంది. తాము ప్రయోగించిన అతిపెద్ద బాంబు ఏజీబీయూ-43బీ(ఎంవోఏబీ)తో పెద్ద మొత్తంలో ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయారని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అత్యంత శక్తిమంతమైన ఈ బాంబు దాడిలో అప్ఘనిస్థాన్లోని నంగర్హార్ ప్రావిన్నస్లోగల అచ్చిన్ జిల్లాలో తలదాచుకున్న ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొంది.
అదే సమయంలో అమెరికా తాజా బాంబుదాడితో తమకు ఎలాంటి నష్టం సంభవించలేదని ఇస్లామిక్ స్టేట్ స్పష్టం చేసింది. శుక్రవారం అధికార ప్రకటన విడుదల చేసిన ఐసిస్ తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ప్రాణం పోలేదని తెలిపింది. ఐసిస్ అధికారిక మీడియా తమాక్ ద్వారా ఈ విషయం చెబుతూ‘నిన్న అమెరికా దాడిలో ఒక్క మరణం సంభవించలేదు.. ఒక్కరు గాయపడలేదు’ అంటూ ప్రకటించింది.
ప్రపంచంలో ఇంతవరకు కనిపెట్టిన బాంబుల్లోకెల్లా అమ్మలాంటి బాంబుగా అమెరికా పిలుచుకుంటున్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ -‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’(ఎంఓఏబీ) ను ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో లేని అఫ్గాన్లో ఎందుకు వేశారని ఒకవైపు యుద్ధనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బాంబు అణు బాంబు కాదు. ఇందులో 8,482 కిలోల పేలుడుపదార్థాన్ని కూర్చారు. జీపీఎస్ ఆధారిత ఎంఓఏబీ భూమికి 1.8 మీటర్ల ఎత్తులో ఉండగానే పేలిపోతుంది. దీంతో పేలుడు శక్తి నలుదిశలా విస్తరించి నష్టం ఎక్కువ కలుగుజేస్తుంది. ఇది గుహల్లోకి చొచ్చుకెళ్లేది కాదు. కొండలను తొలిచి స్థావరాలను ఏర్పాటు చేసుకునేటపుడు సూటిగా ఒకే మార్గం తవ్వరు. మార్గాలు పలు మలుపులు తిప్పుతారు. కాబట్టి నంగర్హర్లో గుహలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పడానికి లేదు.
ఇక మరో కథనం ప్రకారం, అఫ్గానిస్తాన్లో గురువారం అమెరికా చేసిన భారీ బాంబు దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్గాన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక కేరళ వాసి కూడా ఉన్నట్లు సమాచారం. దాడి మృతుల్లో కేరళ కాసర్గోడ్ జిల్లా పద్నా గ్రామానికి చెందిన ఐసిస్ మిలిటెంట్ ముర్షీద్ ఉన్నట్లు తనకు టెలిగ్రామ్ ద్వారా సమాచారం అందిందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుర్ రహిమాన్ తెలిపారు. నంగర్హర్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో అమెరికా వాయుసేన ఐసిస్ సొరంగాల సముదాయంపై వేసిన 11 టన్నుల ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ధాటికి పలు ఐసిస్ గుహలు, మందుగుండు సామగ్రి ధ్వంసమైందని, ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లేదని ఆప్ఘాన్ అధికారులు చెప్పారు.