ఇజ్రాయేల్ అణు కేంద్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు ఇరాన్ సాయుధ దళాలు హెచ్చరికలు చేశాయి. ఈ మేరకు ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి తాజాగా ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయేల్కు చెందిన సున్నితమైన నిఘా సమాచారం తమకు లభించిందని ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిఘా వర్గాల ద్వారా సేకరించిన సమాచారంతో ఇజ్రాయేల్లోని కీలక లక్ష్యాలను గుర్తించామని ఎస్ఎన్ఎస్సి తెలిపింది. ఇరాన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయేల్ ఏదైనా సైనిక చర్యకు దిగితే, ఈ లక్ష్యాలపై ప్రతీకార దాడులు చేయడానికి తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
"శత్రు దేశాల నుంచి వస్తున్న దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడానికి, అలాగే ఇరాన్ నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చేపట్టిన విస్తృత వ్యూహాత్మక చర్యలలో ఇది ఒక భాగం" అని ఆ మండలి వివరించింది.