అమెరికాలో భారతీయ వంటకాలకు విశేష ఆదరణ పెరుగుతోంది. ఒకుపుడు చికెన్ టిక్కా మసాలా, బటర్ చికెన్ వంటి వాటికే పరిమితమైన అమెరికా పౌరులు.. ఇపుడు ఘాటైన బిర్యానీలు, మసాలా కూరలను కూడా అమిత ఇష్టంగా లాగించేస్తున్నారు. వారి ఆహారపు అలవాట్లలో వస్తున్న ఈ మార్పు అక్కడి ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి కొత్త వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి.
కాలిఫోర్నియాలోని ఓ తెలుగు టెకీ తన అమెరికన్ సహోద్యోగులకు పార్టీ ఇచ్చేందుకు ఇండియన్ రెస్టారెంట్కు తీసుకెళ్లగా, వారంతా దక్షిణాది వంటకాలను ఆర్డర్ చేయడం చూసి ఆశ్చర్యపోయాడు. సాధారణంగా మసాలాలు తక్కువగా ఉండే థాయ్, జపనీస్ వంటకాలను ఇష్టపడే అమెరికన్లు, ఇప్పుడు ఘాటైన మసాలా వంటకాలను అమితంగా ఆరగిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కాదని ఇండియన్ రెస్టారెంట్లకు వస్తున్నారు.
ఈ డిమాండ్ కారణంగా అమెరికా వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2025 అక్టోబరు నాటి గణాంకాల ప్రకారం, యూఎస్ సుమారు 10,000 భారతీయ రెస్టారెంట్లు ఉండగా, వాటిలో అత్యధికంగా 2,000 రెస్టారెంట్లు ఒక్క కాలిఫోర్నియాలోనే ఉన్నాయి.
ఆ తర్వాత టెక్సాస్ (1,500), న్యూయార్క్ (1,000) రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, షికాగో, డాలస్ వంటి నగరాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. డాలస్ మెట్రో ప్రాంతం అయితే సుమారు 400 రెస్టారెంట్లతో దక్షిణ భారత రుచులకు చిరునామాగా మారిపోవడం గమనార్హం.