Publish Date: Fri, 08 Jan 2021 (08:35 IST)
Updated Date: Fri, 08 Jan 2021 (08:36 IST)
అమెరికాకు ఆత్మలాంటి క్యాపిటల్ హిల్స్పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడులు చేసి బీభత్సం సృష్టించారు. అమెరికాలో చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఇంతవరకు చోటుచేసుకోలేదు. ఈ దాడి ఘటనతో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ఈ దాడి ఘటనపై ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న ఫే బుక్, కఠిన నిర్ణయం తీసుకుంది.
డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిరవధికంగా రద్దు చేస్తున్నట్టు సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. గురువారం 24 గంటల పాటు ఆయన ఖాతాను ఫేస్బుక్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఒకరోజు నిషేధాన్ని నిరవధిక నిషేధంగా మారుస్తున్నామని జుకర్ బర్గ్ ఓ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.
అలాగే, అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్కు అధికారాన్ని అప్పగించే ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోగా, వాటిని ట్రంప్, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, అందుకు ఫేస్బుక్ను వాడుకుంటున్నారని ఈ సందర్భంగా జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. తన పదవీ కాలంలో మిగిలివున్న సమయాన్ని సాధ్యమైనంత స్వలాభానికి వాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అందువల్లే ఖాతాను నిలిపివేశామని తెలిపారు.
అధికార మార్పిడిని అణగదొక్కేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, తన మద్దతుదారుల చర్యలను సమర్ధిస్తున్నారని ఆరోపించిన ఫేస్బుక్, ఇది ప్రపంచాన్నే కలవరపరిచే అంశమని వెల్లడించింది. ఇక మరో 13 రోజుల్లో అధ్యక్షుడు మారతాడని, ఈ సమయంలో ప్రజలు శాంతియుతంగా ఉండి, ప్రజాస్వామిక నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని జుకర్ బర్గ్ విజ్ఞప్తి చేశారు.