Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్ సభ్యులు...

డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన రిపబ్లికన్ సభ్యులు...
, గురువారం, 14 జనవరి 2021 (10:19 IST)
అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటన చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ దాడి ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. ఈ దాడి ఘటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు డెమొక్రాట్లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. ఈ తీర్మానానికి 10 మంది రిపబ్లికన్లు సహా మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత ఏడాది అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ పదేపదే ఆరోపించారు. ఈ క్రమంలో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించడం కోసం ఈనెల 6న కేపిటల్ భవనంలో యూఎస్ కాంగ్రెస్ సమావేశమైంది. 
 
కాగా, ట్రంప్ పిలుపుతో అప్పటికే అక్కడకు చేరుకున్న ఆయన మద్దతుదారులు కేపిటల్ భవనంలోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేపిటల్ ఘటనకు ట్రంపే కారణం అంటూ ప్రతినిధుల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేసింది. అయితే ట్రంప్ దీనికి నిరాకరించిన విషయం తెలిసిందే. 
 
ఈ క్రమంలో భారీ భద్రత నడుమ బుధవారం రోజు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించేందుకు దిగువసభలో డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. 
 
అనంతరం ఓటింగ్ జరపగా 232 మంది అభిశంసన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. కేవలం 197 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి దిగువ సభ ఆమోదముద్ర పడింది. కాగా.. ఈ తీర్మానానికి సెనేట్ కూడా ఆమోదం తెలిపితే.. ట్రంప్ అధ్యక్ష పదవిని కొల్పోతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాక్సిన్లు కోరుకునే ఛాన్స్ ప్రజలకు లేదు : కేంద్రం