అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సర్కారు పెంచిన హెచ్1బీ వీసా ఫీజుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అమెరికా టెక్ కంపెనీల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ ఫీజు పెంపు కారణంగా తమపై 1.23 లక్షల కోట్ల భారం పడుతుందంటూ గగ్గోలు పెట్టాయి. దీంతో ట్రంప్ సర్కారు దిగివచ్చింది. కీలక రంగాల్లో హెచ్1బీ వీసా ఫీజును తగ్గించింది.
జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం... కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోని సెక్షన్ 1 (సి)లో మినహాయింపుల ప్రస్తావన ఉంది. యూఎస్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపులపై అధికారం ఉంది. ఆయన తన విచక్షణ వినియోగించవచ్చు.
విశేష నైపుణ్యం గల వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపుల అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు, మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరితోపాటు మరికొన్ని రంగాల్లోని అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు హెచ్-1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు భారాన్ని తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది. ఫిజీషియన్లు, వైద్య, ఆరోగ్య పరిశోధనలు, రక్షణ, జాతీయ భద్రత, స్టెమ్ కార్యకలాపాలు, ఇంధనం, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలకు ఈ తగ్గింపు వర్తించే అవకాశం ఉంది.
కాగా, డొనాల్డ్ ట్రంప్ కొత్తగా జారీ చేసే హెచ్-1బి వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజు మనదేశంలో ప్రధానంగా ఐటీ రంగంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నెల 21 నుంచే కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక ఏడాది పాటు అమల్లో ఉంటుంది.
ఈ లోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్లో చట్టం చేస్తే, ఆ తర్వాత పూర్తిస్థాయిలో అమల్లో ఉంటుంది. మనదేశం నుంచి హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లే ఒక ఉద్యోగి సగటు వార్షిక వేతనం 60,000 - 140,000 డాలర్ల మధ్యలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో హెచ్-1బీ వీసా కోసం ఒక ఉద్యోగిపై లక్ష డాలర్ల ఫీజు చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావటం ఎంతో కష్టం. ఈ భారం నుంచి ఎవరికైనా మినహాయింపులు ఉన్నాయా అనేది ఆసక్తికర అంశం.