సాధారణంగా జైలుశిక్ష పడిన నేరస్థులు ఆ శిక్షలను తప్పించుకునేందుకు వివిధ రకాలైన ఎత్తులు వేస్తుంటారు. కానీ, చైనాకు చెందిన ఓ మహిళ చేసిన పనికి అధికారులు సైతం విస్తుపోయారు. తాను చేసిన నేరానికి ఐదేళ్ల శిక్ష పడగా, ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లలో ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చైనా అధికారులు సైతం నివ్వెరపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
చైనాలోని షాన్సీ ప్రావిన్స్కు చెందిన చెన్ హాంగ్ అనే మహిళను ఓ మోసం కేసులో కోర్టు దోషిగా తేల్చింది. దీంతో కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, చైనా చట్టాల ప్రకారం గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు జైలు బయట ఉంటూనే స్థానిక అధికారుల పర్యవేక్షణలో శిక్ష అనుభవించవచ్చు. ఇదే నిబంధనను చెన్ హాంగ్ తనకు అనుకూలంగా మార్చుకుంది. శిక్ష ఖరారైన నాటి నుంచి పదేపదే గర్భం దాల్చుతూ జైలుకు వెళ్లకుండా తప్పించుకుంది. ఈ క్రమంలో నాలుగేళ్లలో ఒకే వ్యక్తి ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
ఇటీవల మే నెలలో అధికారులు జరిపిన తనిఖీల్లో ఆమె అసలు ప్లాన్ బయటపడింది. ఆమె మూడో బిడ్డను తన వదిన పేరు మీద నమోదు చేసినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో తాను విడాకులు తీసుకున్నానని, మొదటి ఇద్దరు పిల్లలు మాజీ భర్త వద్ద ఉంటున్నారని, మూడో బిడ్డను తన మాజీ భర్త సోదరికి ఇచ్చేశానని ఆమె అంగీకరించింది. దీంతో ఆమె కావాలనే గర్భం దాల్చి శిక్షను ఎగ్గొడుతోందని నిర్ధారించుకున్న అధికారులు, ఆమెను వెంటనే జైలుకు పంపాలని నిర్ణయించారు. అయితే, చెన్ హాంగ్ శిక్షాకాలం మరో ఏడాదిలోపే మిగిలి ఉండటంతో అధికారులు ఆమెను జైలుకు బదులుగా ఒక నిర్బంధ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన చైనా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.