వందల సంవత్సరాల పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాలను తన గుప్పిట్లో ఉంచుకుని పాలించిన బ్రిటన్, ఇప్పుడు స్వాతంత్ర్యం కోరుకుంటోంది. స్వేచ్ఛా వాణిజ్యం నుంచి యూరప్లో ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దేశాల భారం తమపై పడకుండా స్వంతంత్రాన్ని కోరుతోంది. ఐరోపా దేశాల కూటమిలో ఉండటం వల్ల తమకు నష్టమే అధికమని భావిస్తున్న బ్రిటన్ వాసులు, కూటమి నుంచి వైదొలగాలని తీర్పిస్తున్నారు.
విడిపోవాలని 52 శాతం మంది, కలిసుండాలని 48 శాతం మంది ప్రజలు తీర్పిచ్చినట్టు బీబీసీ వార్తా సంస్థ ప్రకటించింది. ఐటీవీ సైతం అదే విషయాన్ని స్పష్టం చేసింది. విడిపోవాలన్న వాదనకు మెరుగైన మద్దతు లభించిందని వెల్లడించింది. ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాల్లో బ్రెగ్జిట్కు అనుకూలంగా 1,20,83,633 మంది, వ్యతిరేకంగా 1,12,88,706 మంది ఓట్లు వేసినట్టు ది గార్డియన్ పేర్కొంది.
అంతకుముందు.. యూరోపియన్ సమాఖ్యలో బ్రిటన్ ఉండాలా? వద్దా? అనే అంశంపై నిర్వహించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. గంట గంటకు ఫలితాలు తారుమారవుతున్నాయి. ఫలితాల సరళి చూస్తే తొలుత వెళ్లాలనుకునే వారిదే ఆధిక్యత కనబడింది. ఆ తర్వాత కాసేపటికే వద్దనుకునే వారి సంఖ్య పెరిగింది. మళ్లీ కొద్దిసేపటికే వెళ్లానుకునే వారు స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.
భారత కాలమానం ప్రకారం గురువారం అర్థరాత్రి తర్వాత ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలి దశలో విడుదలైన ఫలితాల సరళి చూసినప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలనుకునే వారిదే పైచేయిగా కనిపించింది. ఉదయం 6 గంటల సమయం వరకు (భారత కాలమానం ప్రకారం) వైదొలగాలనుకునేవారిదే స్వల్ప ఆధిక్యం కనిపించింది.