Publish Date: Thu, 02 Apr 2020 (14:59 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (15:00 IST)
కరోనా వైరస్ కబళించిన నేపథ్యంలో కనీసం పది వారాల పాటు అమెరికాలో షట్డౌన్ ప్రకటించాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కోరారు. ఈ మేరకు ఆయన ది వాషింగ్టన్ పోస్ట్కు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులోని మాటను వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే దేశ వ్యాప్తంగా కనీసం 10 వారాల పాటుల షట్డౌన్ను కఠినంగా అమలు చేయాలని లేకుంటే తీవ్ర ఆర్థిక సంక్షోభ తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు చేరారు.
ఈ నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తూ, "పెరుగుతున్న మహమ్మారి విషయంలో ఎవరినీ నిందించకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా రాష్ట్రాల్లో బీచ్లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. వారిలానే వైరస్ కూడా వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్డౌన్ ఒక్కటే మార్గం" అని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకూ షట్డౌన్ చేయాలని, అప్పుడే ప్రజలను కాపాడుకోవచ్చని, కనీసం 10 వారాల పాటు దీన్ని అమలు చేయాలని అధ్యక్షుడు ట్రంప్కు బిల్ గేట్స్ సలహా ఇచ్చారు. ఈ విషయంలో వెనుకంజ వేస్తే, అది ఆర్థిక బాధలను పెంచుతుందని హెచ్చరించారు.