జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా, భారత వైమానిక దళాలు తమ దేశంలోని అతి ప్రధానమైన ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయని, దీంతోనే తాము తలొగ్గాల్సివచ్చిందని పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తెలిపారు. ఈ దాడుల కారణంగా భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవచూపాల్సివచ్చిందన్నారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా, రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లలోని రెండు కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసినట్టు ఆయన అంగీకరించారు. ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణకు సిద్ధపడ్డామని ఆయన ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోరారు.
దురదృష్టవశాత్తు తెల్లవారుజామున 2.30 గంటలకు భారత్ మరోమారు క్షిపణి దాడులకు తెగబడింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, పంజాబ్ ప్రావిన్స్లోని షార్కోట్ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ ఘటన జరిగిన 45 నిమిషాల్లోనే సౌదీ యువరాజు ఫైసల్ నాకు ఫోన్ చేశారు. అప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేను జరిపిన సంభాషణ గురించి ఆయనకు తెలిసిందని చెప్పారు.
భారత్ దాడులు ఆపితే, పాక్ కూడా ఆపడానికి సిద్ధంగా ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్క తెలియజేయడానికి తనకు అధికారం ఉందా అని అడిగారు. నేను సరే సోదరా.. మీరు మాట్లాడొచ్చు అని చెప్పాను. ఆ తర్వాత ఆయన మళ్లీ ఫోన్ చేసి జైశంకర్కు ఈ విషయం తెలియజేశానని చెప్పారు.